మాలీలకు ఎస్టీ హోదా సాధించే వరకు ఉద్యమం:
అర్జున్ సమాచారం,ఆగస్టు 20, జిల్లా ప్రతినిధి (కొమరం భీం)
మాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
వాంకిడి: మాలీ కులస్థులకు ఎస్టీ హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్రావు డిమాండ్ చేశారు. ఎస్టీ హోదా సాధించే వరకు మాలీ సమాజం ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాలీ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని శ్యామ్రావు కోరారు. ఎంపీ గెడం నగేష్, ఎమ్మెల్యే హరీష్బాబు సహా బీజేపీ ప్రజాప్రతినిధులు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మాలీల ఎస్టీ హోదా అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాలీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎస్టీ హోదా కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు.
రాష్ట్రంలో మాలీ సమాజం జనాభా సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉందని శ్యామ్రావు పేర్కొన్నారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించడం ద్వారా సామాజిక అభివృద్ధికి మరింత అవకాశం కలుగుతుందని తెలిపారు.
మాలీ సమాజం ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున ప్రత్యేకంగా మాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని శ్యామ్రావు ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్ ద్వారా విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు, మేధావులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్లను సాధించుకుంటామని, ఎస్టీ హోదా వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లా అధ్యక్షుడు వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, వాంకిడి మండల గౌరవ అధ్యక్షుడు గౌరయ్య, మండల అధ్యక్షుడు బాబూరావు, మండల ప్రధాన కార్యదర్శి జ్యోతిభా, మండల ఉపాధ్యక్షుడు దివాకర్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.>≥